Friday, October 2, 2015

హైదరాబాద్ రాజ్య స్థాపన - నిజాంల పాలన


-నిజాం రాజ్యస్థాపకుడు: నిజాం ఉల్ ముల్క్. 1724లో
-రాజభాష: పర్షియా. కానీ 1893 నుంచి 1948 వరకు ఉర్దూ రాజభాషగా మారింది.
-ఉర్దూను రాజభాషగా మీర్ మహబూబ్ అలీఖాన్ మార్చాడు.
-గొప్పవాడు: మీర్ ఉస్మాన్ అలీఖాన్
-చివరివాడు: ముఖరం జాహి
-రాజముద్ర: కుల్చా (ఒక రకమైన రోటీ)

Nizam-paleces


గోల్కొండ రాజ్య పతనాంతరం మొగల్ రాజ్యంలో 21వ సుభా రాష్ట్రంగా ఔరంగజేబు కలిపివేశాడు (సుభాలు అంటే మొగల్స్ రాజ్యంలోని రాష్ర్టాలు). మొదట అక్బర్ 15 సుభాలుగా, జహంగీర్ 17 సుభాలుగా, షాజహాన్ 19 సుభాలుగా, ఔరంగజేబు 21 సుభాలుగా నెలకొల్పాడు. దీంతో మొగల్ రాజ్యంలో 1687 నుంచి 1724 వరకు గోల్కొండ ఒక రాష్ట్రంగా ఉంది. చివరికి నిజాం ఉల్‌ముల్క్ మొగల్ చక్రవర్తి మహ్మద్ షా ప్రమేయంతో స్వతంత్ర రాజ్యం నెలకొల్పాడు.

-1707లో ఔరంగజేబు మరణానంతరం భారతదేశంలో అనేక నూతన రాజ్యాలు ఏర్పడ్డాయి. దీనికి ఔరంగజేబు స్థాపించిన విశాల రాజ్యం, అతని వారసులు అసమర్ధులు కావడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. వీరు యోచన లేని రాజు, మూర్తీభవించిన మూర్ఖుడు, పిరికిపంద, రంగీలా రాజాలుగా ప్రసిద్ధి చెందారు.

ఔరంగజేబు కుమారులు

1. బహదూర్ షా-I (యోచనలేని రాజు)
2. జహందర్ షా (మూర్తీభవించిన మూర్ఖుడు)
3. ఫరూక్ సియర్ (పిరికివాడు)
4. మహ్మద్ షా (రంగీలా రాజా)

దక్కన్ విధానం

-దక్కన్ విధానం అనేది ఔరంగజేబుకు క్యాన్సర్ లాంటిది. మొగల్ సామ్రాజ్యాన్ని ఈ విధానమే నాశనం చేసిందని నాటి సమకాలీన చరిత్రకారుల అభిప్రాయం.

Mir_Nizam_Ali_Khan

-చివరికి మొగలుల కాలంలోనే బెంగాల్‌లో ముర్షీద్ ఖులీఖాన్, జేద్‌లో సాదత్ ఉల్లాఖాన్, హైదరాబాద్ (దక్కన్)లో మీర్‌కమ్రుద్దీన్ ఖాన్‌లు స్వతంత్ర రాజ్యాలు స్థాపించారు. ఇందులో హైదరాబాద్ సంస్థానమే ప్రత్యేకమైనది. ఎందుకంటే.. అది విశాలమైనది, సంపన్నమైంది, భారతదేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించింది. భారతదేశ చరిత్ర, హైదరాబాద్ చరిత్ర అనేంత వరకు వచ్చిన సందర్భాలున్నాయి. అసలు హైదరాబాద్ నగరానికి సింహాల నగరం అని పేరు. హైదర్ అంటే సింహమని, ఆబాద్ అంటే పట్టణమనే అర్థాలున్నాయి. హైదరాబాద్ మొదట అచలపురం అనే కుగ్రామంగా ఉండేది. ఇలాంటి చిన్న గ్రామాన్ని గొప్ప విశ్వనగరం (కాస్మోపాలిటన్)గా మారడానికి మహ్మద్‌కులీ కుతుబ్ షా హయాంలోని అష్రబాదీ అనే ఇంజినీర్ గొప్పతనమేనని చెప్పవచ్చు.

అష్రబాదీ ఇరాన్ నగరానికి చెందిన వ్యక్తి. హైదరాబాద్ నగర నిర్మాణ సమయంలో కుతుబ్ షా (మహ్మద్ కులీ) ఓ దేవుడా..! నేను నిర్మించే ఈ నగరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లేటట్లు, చెరువులో చేపలు వృద్ధిచెందినట్లుగా ఈ పట్టణం ప్రజలతో నిండిపోవా లని ఆశీర్వదించమని వేడుకున్నాడు. అయితే కుతుబ్ షా ప్రార్థ్ధనతో ప్రస్తుతం హైదరాబాద్ భారతదేశంలోనే గొప్ప ఆదర్శవంతమైన నగరంగా, విశ్వనగర స్థాయికి ఎదిగింది. అంటే ఒక మంచి మనస్సు, ఉన్నత ఆశయం, కృషితో మొదలు పెడితే అది విజయవంతం అవుతుందనే సూత్రం మనకు ఇందులో కన్పిస్తుంది.

హైదరాబాద్ రాజ్యం (1724-1948)


-1724లో హైదరాబాద్ రాజ్యంగా ఔరంగాబాద్‌లో రాజధానిని మీర్‌కమ్రుద్దీన్ నెలకొల్పాడు. ఇతనికే మొదటి అసఫ్‌జాహి అని, నిజాం ఉల్ ముల్క్ అని, చిన్ కిల్కిచ్ అనే బిరుదులున్నాయి. మొగల్ రాజు మహ్మద్ షా ఇతన్ని స్వతంత్ర రాజుగా గుర్తించాడు. అదే సమయంలో మరాఠాలో పీష్వాల పాలన మొదటి బాజీరావు నేతృత్వంలో హింద్ పద్‌పద్ షాహీగా భారతదేశంలో హైందవ సంస్కృతిని తిరిగి పునరుద్ధరించాలనే ఆశయం మొగలు రాజుకు తలనొప్పిగా తయారయ్యారనే ఉద్దేశంతోనే మహారాష్ట్రలో హైదరాబాద్ రాజ్యం నెలకొల్పడానికి సహాయం అందించాడు. చివరికి 1738లో హైదరాబాద్ నిజాం భోపాల్ యుద్ధంలో మొదటి బాజీరావు చేతిలో ఓడిపోయి దురై-సరై సంధితో యుద్ధం ముగించాడు. ఇతడు చివరికి 1739లో ఢిల్లీపైకి దండెత్తి నాదీర్షాకు, మొగలు రాజుకు మధ్య సయోధ్య వాతావరణాన్ని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించాడు. చివరకు 1748 లో బుర్హమ్‌పూర్‌లో మరణించాడు. ఇతని మరణంతో దక్కన్ ప్రాంతంలో సింహాసనం కోసం వారసత్వ యుద్ధ్దాలు ప్రారంభమయ్యాయి.

నిజాం ఉల్ ముల్క్ కుమారులు


1. ఘాజీఉద్దీన్
2. నాసర్ జంగ్
3. సలాబత్ జంగ్
4. బసాలత్ జంగ్
5. నిజాం అలీఖాన్
6. ముజఫర్ జంగ్
-నిజాం కుమార్తె కుమారుడు అంటే నిజాం ఉల్ ముల్క్‌కు మనవడు, నిజాం రెండో కుమారుడైన నాసర్ జంగ్‌కు మనవడు ముజఫర్ జంగ్‌కు మధ్య సింహాసనం కోసం పోటీ ఏర్పడింది. దీన్ని అవకాశంగా తీసుకున్న ఐరోపా దేశస్తులైన ఫ్రెంచివారు ముజఫర్ జంగ్‌కు, బ్రిటీష్ వారు నాసర్ జంగ్‌కు సహాయంగా ఉన్నారు. ఇది రెండో కర్ణాటక యుద్ధానికి దారితీసింది.

నాసర్ జంగ్ (1748-50)


-నిజాం ఉల్ ముల్క్ రెండో కుమారుడు నాసర్ జంగ్. ఇతనికి మొగలు చక్రవర్తి మహ్మద్ షా నిజాం ఉద్దౌలా అనే బిరుదు ఇచ్చాడు. తన మేనల్లుడైన ముజఫర్ జంగ్‌తో వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. దీనికి బ్రిటీష్ వారి సహాయం తీసుకున్నాడు. అయితే వారికి ప్రతిఫలంగా కింది ప్రాంతాలు ఇవ్వడానికి ఇరువురి మధ్య ఒప్పందం జరిగింది.
1. ముర్తజానగర్ (గుంటూరు)
2. చికాకోల్ (శ్రీకాకుళం)
3. మచిలీపట్నం
4. ఏలూరు.
-ఈ ఒప్పందానికి నాసర్ జంగ్ ఒప్పుకోవడంతో అతనికి బ్రిటీష్‌వారు సహాయం చేశారు. అయితే కర్ణాటకలో ఫ్రెంచి గవర్నర్ డూప్లే ఆధ్వర్యంలో ఫ్రెంచి ప్రాబల్యం బలంగా ఉండటంతో వారితో జరిగిన అంబూరు యుద్ధంలో బ్రిటీష్ వారు ఓడిపోయారు. డూప్లే జీన్ ఆల్బర్ట్ అనే వితంతువును వివాహం చేసుకున్నాడు. భారతీయులకు తొలిసారిగా ఉద్యోగావకాశాలు కల్పించింది కూడా ఫ్రెంచివారే. డూప్లే రాజకీయ చతురత వల్ల హిమ్మత్‌ఖాన్‌తో నాజర్ జంగ్ చంపబడ్డాడు.

ముజఫర్ జంగ్ (1750-51)


-ఫ్రెంచివారు ఇతన్ని దక్కన్ సుబేదార్, హైదరాబాద్ నవాబ్‌గా నియమించారు. దీనికి ప్రతిఫలంగా ఫ్రెంచి గవర్నర్ డూప్లేకు జఫార్ జంగ్ (విజేత) అనే బిరుదు ఇచ్చి ముస్తఫానగర్, మచిలీపట్నం ప్రాంతాలను ధారాదత్తం చేశాడు. ఇది సహించని రాయలసీమ ముస్లిం పాళెగార్లు, నవనూర్ నవాబు (కడప జిల్లా) రాయచోటి దగ్గర్లోని లక్కిరెడ్డిపల్లి వద్ద ముజఫర్ జంగ్‌ను హతమార్చారు. (పాళేగార్ల వ్యవస్థను 1820లో థామస్ మన్రో అణిచివేశాడు)

సలాబత్ జంగ్ (1751-61)


-ఇతను నాజర్ జంగ్ సోదరుడు. హైదరాబాద్ నవాబుగా ఫ్రెంచి అధికారైన బుస్సీ నియమించాడు. ఇందుకు ప్రతిఫలంగా సలాబత్ జంగ్ ఉత్తర సర్కార్ జిల్లాలను (గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణా, నెల్లూరు) కానుకగా ఇచ్చాడు. చివరికి ఫ్రెంచి ప్రాబల్యం గల 1758 చందుర్తి యుద్ధంలో, 1754లో మచిలీపట్నం యుద్ధంలో కాన్‌సాక్స్ సేనల చేతిలో ఓడిపోయాడు....... అనంతరం ఉత్తర సర్కార్ ప్రాంతాలను వెనక్కి తీసుకున్నాడు. తర్వాత 1766లో వాటిని నిజాం అలీఖాన్ బ్రిటీష్ వారికి ధారాదత్తం చేశాడు. బ్రిటీష్ వారికి ఇప్పించడంలో కాంట్రేగుల జోగి పం తులు గొప్ప దుబాసిగా (ట్రాన్సిలేటర్) ప్రసిద్ధి. ఇతను క్రియాశీలక పాత్ర పోషించాడు. ఇతనికాలంలో ఆంధ్రలో ముఖ్య సంఘటనలు..

బొబ్బిలి యుద్ధం (1757)


-బొబ్బిలి జమీందార్ విజయరంగారావుకు, విజయనగరం జమీందార్ విజయరామరాజుకు మధ్య ఉన్న వైరాన్ని బుస్సీ తనకు అనుకూలంగా మార్చుకొని, విజయనగరం జమీందార్‌తో కలిసి బొబ్బిలి రాజ్యాన్ని పతనం చేసి, విజయరంగారావును చంపివేశాడు. దీనికి కోపోద్రిక్తుడైన రంగారావు బావమర్ది తాండ్ర పాపారాయుడు (బొబ్బొలి పులి) విజయనగరంపై దండెత్తి విజయరామరాజును చంపివేశాడు. ఫ్రెంచి అధికారి బుస్సీ హైదరాబాద్‌కు పారిపోయాడు. దీంతో రెండు జమీందార్ రాజ్యాలు నాశనమయ్యాయి. చివరకు తాండ్ర పాపారాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

చందుర్తి యుద్ధం (1758)


-హైదరాబాద్ రాజ్యంలో బ్రిటీష్ వారికి, ఫ్రెంచి వారికి జరిగిన మొదటి యుద్ధం. ఈ యుద్ధంతో ఫ్రెంచివారి పతనం ప్రారంభమైంది.
పద్మనాభ యుద్ధం (1794)

-ఈ యుద్ధం బ్రిటీష్ వారికి, విజయనగర జమీందార్ అయిన చిన విజయరామరాజుకు మధ్య జరిగింది.

-ఈ యుద్ధాల తర్వాత సలాబత్‌జంగ్ పతనం చెందిన ప్రెంచివారిని కాదని బ్రిటీష్ వారికి పూర్తి మద్దతు ప్రకటించాడు.1759లో మచిలీపట్నం, నిజాంపట్నం, వక్కల్ మన్నారు, కొండవీడులను బ్రిటీష్ వారికి ఇచ్చాడు. కానీ అనంతరం జరిగిన పరిణామాల్లో సలాబత్ జంగ్‌ను నిజాంఅలీ బీదర్‌కోటలో బంధించి తనకు తానే హైదరాబాద్ పాలకుడిగా ప్రకటించుకున్నాడు.

నిజాం అలీఖాన్(1761-1803)


-ఇతన్ని రెండో అసఫ్ జా అంటారు. అలీఖాన్ కాలం నుంచే అసఫ్‌జాహీ రాజులను నిజాం అని పిలుస్తున్నారు.

-నిజాం అంటే అరబ్ భాషలో సిస్టమ్, ఆర్డర్ అని అర్థం. అంతేకాకుండా వీరు టర్కీలోని తురానీ తెగకు చెందినవారు. అక్కడి సిద్ధ సైన్యాన్ని కూడా నిజాం అంటారు. దీన్నే తమ బిరుదులుగా అసఫ్ జాహీ రాజులు ధరించారు. వీరిలో మహా ఘనత వహించిన నిజాం అని మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు పేరు ఉన్నది. నిజాం అలీఖాన్ నుంచి ఒక వ్యవస్థీకృతమైన పరిపాలనా విధానం, క్రమపద్ధతితో కూడిన పాలన ప్రారంభమైందని చెప్పవచ్చు. కాబట్టి నిజాం రాజు అని ఇతని నుంచే తొలిసారిగా పిలిచారు.

-నిజాం అలీఖాన్ ఉత్తర సర్కార్ జిల్లాలను బ్రిటీష్ వారికి 1766లో ఇచ్చివేశాడు. 1788లో గుంటూరు ప్రాంతాన్ని, 1802లో సీడెడ్ (రాయలసీమ) ప్రాంతాన్ని ధారాదత్తం చేయడం వల్ల వీటిని దత్తమండలాలు అంటారు.

వివరణ: 1808లో దత్తజిల్లాలకు అనంతపురం ముఖ్య కేంద్రప్రాంతం. అదే సంవత్సరంలో జిల్లాలుగా కడప, బళ్లారి, 1858లో కర్నూల్ జిల్లా, 1882లో అనంతపురం, 1911లో చిత్తూరు జిల్లాలుగా ఏర్పడ్డాయి. 1935లో నంద్యాల సమావేశంలో గాడిచర్ల హరిసర్వోత్తమ రావు సీడెడ్ జిల్లాలకు రాయలసీమగా పేరు పెట్టాడు.

-ఫ్రెంచి సైన్యాధికారి పీటర్‌మాండ్ సహాయంతో ఆబిడ్స్‌లోని గన్‌ఫౌండ్రిని నిజాం అలీ నిర్మించాడు. పీటర్‌మాండ్ మూస రాముడుగా ప్రసిద్ధిగాంచాడు. ఇతడి సమాధి మలక్‌పేటలో ఉంది. అలాగే 1799లో సైన్య సహకార సంధిలో భాగంగా బ్రిటీష్ రెసిడెంట్‌గా జేమ్స్‌ప్యాట్రిక్‌ను నియమించాడు.
నిజాం అలీ నిర్మాణాలు:
i. మోతీమహాల్
ii. గుల్షన్ మహల్
iii. రోషన్ మహల్
- నిజాం అలీ తర్వాత సికిందర్ జా నిజామ్‌గా వచ్చాడు.

p-murali