దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరోసారి ఆఫ్-నెట్ డొమెస్టిక్ వాయిస్ కాల్స్‌ను  1 జనవరి 2021 నుండి ఉచితంగా చేస్తామని గురువారం ప్రకటించింది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశాల ప్రకారం, జనవరి 1, 2021 నుండి దేశంలో 'బిల్ అండ్ కీప్'  విధానం అమల్లోకి రానుంది.  

 తాజా  నిర్ణయంతో  జియో  కస్టమర్లు దేశంలోని ఏ మొబైల్ నెట్‌వర్క్‌కైనా ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోగలుగుతారు. ఈ చర్య వల్ల ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాతో సహా ఇతర టెల్కోలకు పోటీని మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది.

ఇప్పటివరకూ జియో  నిమిషానికి 6 పైసలు వసూలు చేసేది. దీంతో మరోసారి ప్రత్యర్థి కంపెనీలకు పోటీ తప్పదని ఎనలిస్టులు భావిస్తున్నారు. 

సెప్టెంబర్ 2019లో ట్రాయ్  1 జనవరి 2020 నుండి బిల్లు అండ్ కీప్ విధానం అమలు చేయడానికి కాలపరిమితిని పొడిగించింది. గత ఏడాది అక్టోబర్‌ నుండి ఇతర మొబైల్ నెట్‌వర్క్‌ల కాల్స్ పై జియో ఆరు పైసల అవుట్‌ గోయింగ్ కాల్ ఛార్జ్ చేసింది.

మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన రెండు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతుల ఉద్యమం ప్రభావంతో కూడా జియో ఉచిత సేవలను పునః ప్రారంభించిందని పేర్కొంటున్నారు.

జియో టు జియో ఉచిత కాలింగ్‌ సదుపాయాలను అందిస్తున్న రిలయన్స్‌ జియో గత ఏడాది దేశీయంగా ఇతర నెట్‌వర్క్‌వాయిస్ కాల్స్‌కు ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జీలు (ఐయూసీ) వసూల్  చేసిన సంగతి తెలిసిందే.