Sunday, March 14, 2021

సన్యాసి అవతారంలో ధోని.. షాక్‌లో అభిమానులు

 

 ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందు ఎంఎస్‌ ధోని కొత్త లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సన్యాసి అవతారంలో నైరాశ్యంలో మునిగి ఉన్న ధోనిని చూసి అభిమానులు షాక్‌ తిన్నారు. కాగా ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఇప్పటికే చెన్నైకి చేరుకున్న ధోనీ.. అక్కడ సీఎస్‌కే క్యాంప్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం నెట్స్‌లో బౌలర్లని ఉతికారేస్తూ సిక్సర్ల వర్షం కురిపించిన ధోని అకస్మాత్తుగా ఇలా సన్యాసిగా మారిపోవడం ఏంటని నెటిజన్ల నోరెళ్లబెడుతున్నారు. సన్యాసిలా మారి నైరాశ్యంలో ఉన్న ధోని ఫోటోను స్టార్ స్పోర్ట్స్ తన ట్విటర్‌లో  షేర్ చేసింది.

 

 


 

వాస్తవానికి ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అతని ఆట కంటే హెయిర్ స్టయిల్ గురించే ఎక్కువగా చర్చ నడిచింది. అప్పట్లో పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సైతం ధోనీ జులపాల జుట్టుకి ముచ్చటపడ్డాడు. ఆ తర్వాత 2011లో భారత్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచాక గుండు చేయించుకున్న ధోనీ.. మొహక్ స్టయిల్‌ని కూడా ట్రై చేసేశాడు. గత ఏడాది ఐపీఎల్‌కి ముందు గుబురు గడ్డం, లేయర్డ్ హెయిర్‌తో కనిపించాడు. ధోనీ సన్యాసి అవతారంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. యాడ్ షూటింగ్ కోసం ధోనీ ఆ వేషం వేసినట్లు కొందరు అంచనా వేస్తున్నారు. సన్యాసి అవతారంలో లేకపోయినా.. ధోనీ ఎప్పుడూ సౌమ్యంగానే ఉంటాడని మరికొందరు చెప్పుకొస్తున్నారు. 

కాగా గతేడాది ఐపీఎల్‌ 13వ సీజన్‌ యూఏఈ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ సీజన్‌లో ధోని కెప్టెన్సీలోని సీఎస్‌కే ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసి ఆఖరిదశలో వరుస విజయాలు నమోదు చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరగపోయింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 8 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.