Thursday, March 24, 2022

TS EAMCET: ఎంసెట్‌ రాసే అభ్యర్థులకు అలర్ట్‌.. ఈసారీ ఇంటర్‌ మార్కలకు వెయిటేజీ లేనట్టే..? సిలబస్‌లో కూడా..

 


 
TS EAMCET 2022: ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్‌ పరీక్షలను జూలై 14 నుంచి 20 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రకటించారు.

Telangana EAMCET 2022:తెలంగాణ ఎంసెట్‌ తేదీలు వెలువడ్డాయి. ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్‌ పరీక్షలను జూలై 14 నుంచి 20 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రకటించారు. త్వరలో దరఖాస్తులు, ఫీజులతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్‌ను సెట్‌ కన్వీనర్లు త్వరలో ప్రకటించనున్నారు

జూలై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్‌, మెడికల్‌ విభాగం పరీక్షలను.. జూలై 18 నుంచి 20 వరకు ఇంజినీరింగ్‌ విద్యార్థుల కు పరీక్షలు నిర్వహిస్తారు. పాలిటెక్నిక్‌, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్‌ సెకండియర్‌లో నేరుగా ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఈ సెట్‌ను జూలై 13న నిర్వహించనున్నారు.



ఇంటర్‌ వెయిటేజీ ఉండకపోవచ్చు..?
ఎంసెట్‌లో ఈ ఏడాది ఇంటర్‌ వెయిటేజీ ఉండదని సమాచారం. దీనిపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నది. సాధారణంగా ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. కరోనా దృష్ట్యా గత ఏడాది వెయిటేజీని రద్దుచేశారు. ఎంసెట్‌ మార్కుల ఆధారంగానే ర్యాంకులను ప్రకటించారు. గత అక్టోబర్‌లో నిర్వహించిన ఫస్టియర్‌ పరీక్షల్లో 51% విద్యార్థులు ఫెయిలయ్యారు. వారికి 35% మార్కులేసి పాస్‌చేశారు. ఈ నేపథ్యంలో ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ అమలుచేస్తే ఇబ్బందులు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి.


70 శాతం సిలబస్‌ మాత్రమే..!
ఈ ఏడాది ఎంసెట్‌లో ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌లో 70 శాతం సిలబస్‌కే ప్రశ్నలు అడుగనున్నారు. గతేడాది ఫస్టియర్‌లో 100 శాతం సిలబస్‌, సెకండియర్‌లో 70 శాతం సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడిగారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం సెకండియర్‌ చదివే విద్యార్థులకు ఫస్టియర్‌తోపాటు సెకండియర్‌లోనూ 70 శాతం సిలబసే బోధించడంతో ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు.