Showing posts with label Ap news. Show all posts
Showing posts with label Ap news. Show all posts

Wednesday, September 25, 2024

తిరుమల లడ్డూ వ్యవహారంలో జగన్‌కు పవన్ క్లీన్ చిట్ - ఢిల్లీ ఎఫెక్ట్..

 


 

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం.. రోజుకో మలుపు తిరుగుతోంది. కలియుగ వైకుంఠంలా అలరారుతున్న, సాక్షాత్ శ్రీమహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

 

కోర్టుకూ వెళ్లారు..

కోట్లాదిమంది హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. పలువురు జాతీయ స్థాయి నాయకులు దీనిపై స్పందించారు. ఈ ఆరోపణల వెనుక గల వాస్తవాలను వెలికి తీయాలంటూ సుప్రీంకోర్టునూ ఆశ్రయించారు.

లడ్డూపైనే..

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తోన్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తోన్నారంటూ చంద్రబాబు రెండు రోజుల కిందట ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు- సరికొత్త వివాదానికి తెర తీసినట్టయింది.

 

దీక్షలు..యజ్ఞాలు

స్వయానా ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. టీడీపీ కూటమి భాగస్వామ్య పక్షం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షను స్వీకరించారు. అటు తిరుమలలో మహా సంప్రోక్షణ చేపట్టారు. ఇందులో భాగంగా యజ్ఞయాగాదులను నిర్వహించారు టీటీడీ అధికారులు.

 

తిప్పికొట్టిన వైసీపీ..

తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తోన్న ఈ ఆరోపణలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పి కొడుతున్నారు. సీబీఐతో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. తాను తప్పు చేయలేదంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రమాణం చేయడం- అనుకోని మలుపు.

జగన్‌పై పవన్..

ఈ పరిణామాల మధ్య పవన్ కల్యాణ్- చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తిరుమల లడ్డూ ఆరోపణల్లో వైఎస్ జగన్‌కు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ వ్యవహారంలో తాము జగన్‌ను తప్పు పట్టట్లేదని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఆయన సారథ్యంలో ఏర్పాటైన టీటీడీ బోర్డు సభ్యులే ఈ పని చేశారని స్పష్టం చేశారు. వారిని జగన్ రక్షించే ప్రయత్నం చేస్తోన్నారని పేర్కొన్నారు.

 

Saturday, August 31, 2024

బంపర్ ఆఫర్: 295కే ఇంటర్నెట్ + టీవీ చానెల్లు.. ఇక కేబుల్ టీవీ కనెక్షనే అక్కర్లేదు!

 



ఏపీలో రోజుకు రూ.10తో అపరిమిత వినోదం అంటూ కేబుల్ టీవీలు ఊదరగొడుతూ ఉంటాయి. దీని ప్రకారం నెలకు రూ.300 చెల్లించాలి. అయితే లిమిటెడ్ టీవీ చానెళ్లు మాత్రమే వస్తాయి. మళ్లీ ఇంటర్నెట్ కావాలంటే మరో 400 ఖర్చు పెట్టాలి. దీంతో సగటు కుటుంబానికి నెలకు రూ.700 మినిమం ఖర్చవుతుంది. అంతే కదా. అదే రూ.300లోపే అన్ని టీవీ చానెళ్లూ, ఇంటర్నెట్ రెండూ అందిస్తే.. ఏ వినియోగదారుడైనా తప్పకుండా 300లోపు అన్నీ అందించే సంస్థకే మారుతాడు. ఆ కనెక్షనే తీసుకుంటాడు. రైట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అదే పని చేస్తోంది. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా 295కే టీవీచానెళ్లు, ఇంటర్నెట్ అందిస్తోంది.

త్వరలోనే కేబుల్ టీవీకి మంగళం 

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఇంటికీ అత్యంత చౌక ధరకే ఇంటర్నెట్, టీవీ చానెళ్లకు అందించడానికి గతంలో తీసుకొచ్చిన ఏపీ ఫైబర్ నెట్ ‌ని మరింత  విస్తరించాలని కంకణం కట్టుకుంది. ఒకటీ రెండూ కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల ఇళ్లకు తమ సేవలను అందించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇది అమలైతే రాష్ట్రంలో ప్రధాన MSOలు, కేబుల్ టీవీ దాదాపు కనుమరుగు అవడం ఖాయం. దీంతో కేబుల్ టీవీ చానెళ్లలో పని చేసేవారు, కేబుల్ టీవీ రంగ కార్మికుల్లో ఆందోళన మొదలైంది.

అడ్డుకునే కుట్రలు  

గత కొంత కాలంగా తీవ్రంగా సబ్ స్క్రైబర్లను నష్టపోతున్న కేబుల్ టీవీ సంస్థలు ఇప్పుడు తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. దీనికి తోడు ఈ ఏపీఫైబర్ నెట్‌ విస్తరిస్తే.. తమ మనుగడే ప్రశ్నార్థకం కానుంది. దీంతో కొందరు ఎలాగైనా ఏపీ ఫైబర్‌ నెట్‌ను తమ నెట్ వర్క్ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకోవాలని ఆలోచిస్తున్నారు. తమకు బాగా పట్టున్న విజయవాడ, నెల్లూరు, ఏలూరు, తిరుపతి, విశాఖపట్నం తదితర నగరాల్లో ఏపీ ఫైబర్ నెట్ సేవలు విస్తరించకుండా పలుకుబడి కలిగిన ఎంఎల్‌ఏలు, ఎంపీల ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు మొదలెట్టాలని కసరత్తు చేస్తున్నారు.

 ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

ఏపీ ఫైబర్ నెట్ తమ నెట్ వర్క్ పరిధిలోకి సేవలను విస్తరిస్తే.. వెంటనే అందులోకి మారిపోవాలని కూడా కొందరు కేబుల్ టీవీ ఆపరేటర్లు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా నష్టాల బాట పట్టిన సంస్థ కు చెందిన సీనియర్ ఉద్యోగులు అయితే తమ బాస్ ఈ పాటికే ఏపీఫైబర్‌నెట్‌ లోకి మారేందుకు రంగం సిద్ధం చేసినట్లు కూడా చెబుతున్నారు.

అసలు కారణం ఇదీ

​భారత్‌నెట్ ప్రాజెక్టును ఏపీలో విస్తృతంగా అమలు చేసేందుకు కేంద్రం సాయం అందించాలని ఏపీ మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ కోరారు. ఆయన ఇటీవల దిల్లీలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర టెలికమ్యూనికేషన్‌ శాఖ కార్యదర్శి నీరజ్‌ మిట్టల్‌ను ఏపీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కార్యదర్శి సురేశ్‌కుమార్, ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీ కె. దినేష్‌కుమార్‌లు కలిసి విజ్ఞప్తి చేశారు.

 

35 లక్షల బాక్సులు

భారత్ నెట్ ప్రాజెక్టును విస్తృతంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని సురేష్ కుమార్ కోరారు. భారత్ నెట్ సమర్ద వినియోగం కోసం రాష్ట్రానికి 35 లక్షల సీపీఈ (Customer Premise(s) Equipment) బాక్సులు సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. భారత్ నెట్ రెండో దశలో భాగంగా మల్టీ ప్రొటోకాల్ లేబుల్ స్విచ్చింగ్ టెక్నాలజీ కోసం ఖర్చు చేసిన 650 కోట్ల రూపాయలు ఏపీకి తిరిగి చెల్లించాలని అధికారులు కోరారు.

ఇప్పటికే మిలియన్ కనెక్షన్లు

ఏపీ ఎస్​ఎఫ్​ఎల్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 9.7 లక్షల గృహాలకు హైస్పీడ్ బ్రాండ్ బాండ్ సేవలందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అందులో 5 లక్షల కనెక్షన్లు క్రియాశీలకంగా ఉన్నట్లు తెలిపారు. తక్షణం 35 లక్షల సీపీఈ బాక్సులు అందిస్తే భారత్ నెట్ సేవలను మరింత విస్తృతపరుస్తామని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం తెలిపింది. భారత్ నెట్ ఫేజ్-3 ప్రతిపాదనలు కూడా సమర్పిస్తామని కేంద్రానికి అధికారులు వివరించారు.

 నష్టాల బాటలో ఎంఎస్‌వోలు

ట్రాయ్ నిబంధనలు కఠినతరం చేయడం, గత ఏడాది కొత్త ఎన్టీవోని అమల్లోకి తీసుకురావడం, ప్రధాన చానెళ్లు తమ టారీఫ్‌లను పెంచడం, మరోవైపు వినియోగదారులు ఓటీటీలు, మొబైల్ కంటెంట్ ‌కి మారిపోవడంతో కేబుల్ టీవీ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. దీంతో పలు సంస్థకు ఇప్పటికే నష్టాలు రావడంతో అవి అటు సంస్థలను మూసేయలేక,  ఇటు కంటిన్యూ చేయలేక ఇబ్బంది పడుతున్నాయి. గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఖర్చులను తగ్గించుకుంటున్నా నష్టాలను మాత్రం ఆగడం లేదు.
  

50 శాతం ఉద్యోగుల లే ఆఫ్ 

కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలు కరోనా వచ్చినప్పటి నుంచి ఫీల్డ్ స్టాప్, కాల్ సెంటర్లు, కలెక్షన్ ఏజెంట్లు ఇతరత్రా డిపార్టు మెంట్లకు చెందిన వందల మంది ఉద్యోగులను తీసేసి.. వాటి స్థానంలో యాప్స్, ఇతర టెక్నాలజీని వాడుకుంటున్నారు. అయితే కొందరు ఎంఎస్‌వోలకు అత్యంత కీలకమైన, మంచి రెవెన్యూ అందించే స్థానిక చానెళ్ల ఉద్యోగులపై కూడా ఇప్పుడు వేటు పడేలా కనిపిస్తోంది. గత కొంత కాలం నుంచి కొత్త నియామకాలు జరుగకపోగా.. ఉన్న ఉద్యోగుల్లో 50 శాతం మందికి కోత పెట్టాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మరోవైపు కంటెంట్ ఖర్చులు కూడా పెరగడంతో కొన్ని చానెళ్లను క్లోజ్ చేసే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.