Friday, March 18, 2022

Russia-Ukraine war : యూరప్ దేశాల్లోనూ నశిస్తున్న ఓపిక-జీ7 భేటీకి జర్మనీ పిలుపు

 


ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రపై యూరోపియన్ దేశాల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఓవైపు పశ్చిమదేశాల ఆంక్షలు, మరోవైపు ఈయూ ఆంక్షలున్నా రష్యా ఏమాత్రం తన దూకుడు తగ్గించడం లేదు. ఉక్రెయిన్ పై యుద్ధఁ ప్రారంభించి మూడు వారాలు దాటిపోయినా రష్యా దూకుడు తగ్గడం లేదు. దీంతో తదుపరి చర్యలపై చర్చించేందుకు జీ7 దేశాధినేత భేటీకి జర్మనీ పిలుపునిచ్చింది.

 జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధంపై చర్చించడానికి బ్రస్సెల్స్‌లో మార్చి 24న జరిగే శిఖరాగ్ర సమావేశానికి గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) దేశాల నాయకులను ఆహ్వానించారు.ఈ సమావేశం ప్రస్తుత సమస్యలపై, ముఖ్యంగా ఉక్రెయిన్‌లో పరిస్థితిపై అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆయన ప్రకటించారు. మరోవైపు ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకోకుండా నిషేధం విధించాల్సిన అవసరం ఉందని జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌బాక్ వెల్లడించారు. ఈ దిశగా తమ దేశం నిర్ణయాలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ విషయంలో మౌనంగా ఉండకుండా జర్మనీ తక్షణం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

 మరోవైపు పశ్చిమదేశాలతో పాటు యూరప్ దేశాలూ తమపై విధిస్తున్న ఆంక్షలపై రష్యా మండిపడింది. మాస్కో ఎప్పుడూ పశ్చిమ దేశాలపై ఆధారపడటంపై భ్రమలు పెట్టుకోలేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ప్రకటించారు. యూఎస్ ఆధిపత్యంలో ఉన్న ప్రపంచ క్రమాన్ని అది ఎప్పటికీ అంగీకరించదని అన్నారు. మనం ఒకరోజు మన పాశ్చాత్య భాగస్వాములపై ​​ఆధారపడగలమని ఏదైనా భ్రమ ఉంటే, ఈ భ్రమ ఇప్పుడు ఉండదన్నారు. అమెరికన్లు కోరుకునేది ఏకధ్రువ ప్రపంచమని, ఇది గ్లోబల్ విలేజ్ లాగా ఉండదన్నారు . కానీ ఒక అమెరికన్ గ్రామం లాగా ఉంటుందని తెలిపారు.