Sunday, March 20, 2022

తుపాకీ చేతబట్టిన తొలి మహిళ.. యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

 


తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తుపాకీ చేతబట్టిన తొలిమహిళ మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. కొద్దిరోజులుగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న స్వరాజ్యం చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితమే వైద్యులు మల్లు స్వరాజ్యం ఇకలేరని ప్రకటించారు. ఈనెల 2న ఆమె ఊపిరితిత్తుల సమస్యతో ఆస్పత్రిలో చేరారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి పోరాడిన ధీరవనిత మల్లు స్వరాజ్యం. ఆమె భౌతికకాయాన్ని ఎంబీ భవన్‌కు తరలించనున్నారు.
1945, 46 సాయుధ పోరాట సమయంలో దొరల అహంకారంపై తిరగబడ్డారు స్వరాజ్యం. నైజాం సర్కార్‌ను గడగడలాడించారు.సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో 1931 వ సంవత్సరంలో కుటుంబంలో ఆమె జన్మించారు. భూస్వాముల కుటుంబంలో పుట్టిన ఆమె నైజాం సర్కార్‌కి వ్యతిరేకంగా పోరాడారు. దొరల దురహంకారంపై తన పాటలతో ప్రజలను చైతన్యపరిచారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో స్వరాజ్యం పనిచేశారు.

ఐద్వా రాష్ట్ర, జాతీయ నాయకురాలిగా ఆమె సేవలందించారు.

సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన తొలిమహిళగా స్వరాజ్యం పేరుతెచ్చుకున్నారు. మహిళా కమాండర్‌గా పనిచేశారు. ఆమెను పట్టించిన వారికి నైజాం సర్కార్ పదివేల రివార్డు కూడా ప్రకటించింది.తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978, 1983 ఎన్నికల్లో సీపీఎం పార్టీ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు. నల్గొండ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. తదనంతరం ఆమె రాజకీయాల నుంచి వైదొలిగారు